Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). ‘జోష్‌’తో (Josh) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కెరీర్‌ ఆరంభంల....

Updated : 18 Aug 2022 12:07 IST

హైదరాబాద్‌: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). ‘జోష్‌’తో (Josh) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కెరీర్‌ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతగానో బాధపెట్టిందని తాజాగా ఆయన తెలిపారు. ఆ సంఘటన తర్వాతే తాను థియేటర్లకు వెళ్లడం మానేశానంటూ చై చెప్పుకొచ్చారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.

‘‘నా మొదటి సినిమా ‘జోష్‌’ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో? నటుడిగా వాళ్లు నన్ను ఎలా స్వీకరిస్తున్నారో చూడాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా ఫస్ట్‌డే థియేటర్‌కు వెళ్లా. సినిమా మొదలైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ, సినిమా సగానికి వచ్చేసరికి ప్రేక్షకులు చాలామంది థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. ప్రేక్షకుల్ని అలరించడానికే నేనిక్కడ ఉన్నా. కానీ అది నా వల్ల సాధ్యం కావడం లేదనిపించింది. ఆ అనుభవం నన్నెంతో భయపెట్టింది. అలాగే నాకెన్నో విషయాలు నేర్పించింది. ఆ తర్వాత నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఎందుకంటే ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్‌లో నుంచి పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నా. తాము నటించిన సినిమా విడుదలైన రోజు నటీనటులందరూ ఎంతో కంగారు పడుతుంటారు. అయినప్పటికీ, థియేటర్‌కు వెళ్లి ఫస్ట్‌ డే మూవీ చూస్తారు. కానీ, నేను అలా కాదు. నాకు కంగారు, భయం ఎక్కువ. కొన్ని సీన్లకు ప్రేక్షకులు నవ్వకపోతే? కొన్ని సీన్లకు ఏ విధంగానూ స్పందించకపోతే? అని ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటా’’ అని చై వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని